కరీంనగర్ : పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందిస్తున్న కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ అనుముల నిరంజన్ రెడ్డికి భారత ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు.
1989లో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో చేరిన అనుముల నిరంజన్ రెడ్డి కరీంనగర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేశారు. 1990 జనవరిలో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా తొలి పోస్టింగ్ పొందారు. అప్పటి నుంచి పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తూ తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ధైర్యసాహసాలు, అంకితభావంతో విధులు నిర్వహించినందుకు ఆయన సేవలను గుర్తించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సేవా పతకం, అనంతరం ముఖ్యమంత్రి ఉత్తమ సేవా పతకంతో సత్కరించింది.
ప్రజాసేవకు ప్రత్యేక ప్రాధాన్యం
ప్రస్తుతం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న నిరంజన్ రెడ్డి పోలీసింగ్తో పాటు ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా బాలలు, యువత సన్మార్గంలో నడిచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన వారికి వైద్యులను అందుబాటులోకి తీసుకురావడంలో చొరవ చూపారు. కంటి వైద్య శిబిరాల ద్వారా కంటి అద్దాలను పంపిణీ చేయడంలోనూ తనవంతు సహకారం అందించారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన
డ్రగ్స్ నిర్మూలనతో పాటు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అదేవిధంగా పోలీస్ శాఖలో కీలకమైన సీసీటీఎన్ఎస్ తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శాఖా పరమైన బాధ్యతల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
సేవా రికార్డులో ఎన్నో పురస్కారాలు
నిరంజన్ రెడ్డి సేవా రికార్డులో ఇప్పటివరకు 82 క్యాష్ రివార్డులు, 64 జీఎస్సీలు, 24 ప్రశంసా పత్రాలు ఉన్నాయి. విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, ప్రజా సేవ పట్ల నిబద్ధతకు గుర్తింపుగా తాజాగా ఇండియన్ పోలీస్ మెడల్ లభించడం పట్ల కరీంనగర్ రూరల్ పోలీస్ సిబ్బంది, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ ప్రజలతో మమేకమై పనిచేస్తున్న అనుముల నిరంజన్ రెడ్డికి ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్ దక్కడం కరీంనగర్ జిల్లాకు గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు.








