పాకాల, తిరుపతి జిల్లా: మద్యం మత్తు, క్షణికావేశం ఒకరి ప్రాణాన్ని తీస్తే, ముగ్గురిని జైలు పాలు చేసింది! కలిసి తాగిన స్నేహితుడే శత్రువుగా మారి, దారుణంగా దాడి చేసి చంపేసిన ఘతుక ఉదంతం తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచెరువులో కలకలం రేపింది. ఆకుల కిరణ్ అనే యువకుడి హత్య కేసులో నిందితులైన నిఖిల్, రూపేష్, నరేష్లను పాకాల పోలీసులు మెరుపు దాడిలో అరెస్ట్ చేసి, జేఎఫ్సీఎమ్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
కలిసి తాగారు.. కసితీరా కొట్టారు!
ఈ నెల 22న దామలచెరువులో గొడవపడుతున్న ఆకుల కిరణ్ను శాంతపరచడానికి స్నేహితులు నిఖిల్, రూపేష్, నరేష్లు కారులో మామిడి తోటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం సేవిస్తుండగా, కిరణ్ మద్యాన్ని కింద పోయడంతో వివాదం మొదలైంది. ఊరి చివర ర్యాంప్ వద్దకు వెళ్లాక కూడా మాటమాట పెరగడంతో, కారులో ఉన్న సెంటు సీసా తాగేందుకు యత్నించిన కిరణ్పై మిగతా ముగ్గురు పిడిబాకూల విరుచుకుపడ్డారు. కాళ్లతో, చేతులతో నరరూప రాక్షసుల్లా దాడి చేసి, పైనుంచి కిందకు తోసేయడంతో రాళ్లపై పడి కిరణ్ రక్తమడుగులో తేలాడు. గాయపడిన కిరణ్ను నిందితులే దామలచెరువు ఆసుపత్రికి తరలించారు.
మృత్యువుతో పోరాడి.. రుయాలో కన్నుమూత!
తీవ్ర గాయాలపాలైన కిరణ్ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా, చావుబతుకుల మధ్య పోరాడుతూ ఈ నెల 27న మధ్యాహ్నం 12:55 గంటలకు ప్రాణాలు విడిచాడు. దీంతో మొదట నమోదైన హత్యాయత్నం కేసును హత్య (మర్డర్) కేసుగా మార్చారు.
పోలీసుల మెరుపు అరెస్ట్:
శంఖంపల్లి సమీపంలో శనివారం ఉదయం 8:30 గంటలకు పక్కా సమాచారంతో నిందితులు ముగ్గురిని పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. కేవలం మద్యం మత్తులో, క్షణికావేశంలోనే ఈ దారుణం జరిగినట్లు పాకాల సీఐ టి చిన్న గోవిందు వెల్లడించారు. నిందితులకు రిమాండ్ ఖరారైంది.








