న్యూఢిల్లీ : వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ను 25 రోజులకే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్కు 45 రోజుల వ్యవధి ఉండగా.. ఆ నిబంధనను కేంద్రం సడలించింది.
ఇక నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా 25 రోజుల వ్యవధి నిబంధనే అమల్లోకి రానుంది. ఈ మార్పును తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను కేంద్రం ఆదేశించింది. దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) ఈ నిబంధనను అమలు చేయనున్నాయి.
ఎల్పీజీ సరఫరా మెరుగుపడటంతో నిర్ణయం
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, రీఫిల్ బకాయిలు కూడా తగ్గాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అమల్లో ఉన్న 45 రోజుల పరిమితిని తొలగించినట్లు పేర్కొన్నారు.
యుద్ధ పరిస్థితులతో అప్పట్లో పరిమితులు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో డిమాండ్ను నియంత్రించేందుకు కేంద్రం రీఫిల్ బుకింగ్పై పరిమితులు విధించింది. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధిని అమల్లోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఎల్పీజీ సరఫరా పరిస్థితులు మెరుగుపడటంతో గ్రామీణ ప్రాంతాలపై ఉన్న అదనపు పరిమితిని కేంద్రం తొలగించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు కూడా పట్టణ ప్రాంతాల మాదిరిగానే 25 రోజులకే సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునే వెసులుబాటు లభించనుంది.








