మహబూబ్ నగర్ జిల్లా – మూసాపేట: మూసాపేట మండల పరిధిలోని మౌలాలిగుట్టలో అనుమతులు లేకుండా మొరం తరలించారన్న ఫిర్యాదుపై జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు.
మూసాపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు గత నెల 6న ఫిర్యాదు చేశారు. గత నెల 3న మౌలాలిగుట్ట ప్రాంతంలో షేక్ పాషా, తండ్రి అబ్దుల్ హుస్సేన్, తన సొంత జేసీబీతో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 50 ట్రిప్పుల మొరాన్ని అక్రమంగా తరలించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు నేపథ్యంలో శనివారం జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, మూసాపేట మండల తహసీల్దార్ కార్యాలయ అధికారులు కలిసి మౌలాలిగుట్టలో విచారణ నిర్వహించారు. మొరం తవ్వకాలు, తరలింపునకు సంబంధించిన అనుమతులు, ప్రాంతంలోని పరిస్థితులను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
విచారణలో జిల్లా మైనింగ్ శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, సర్వేయర్ సుజాత, మూసాపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అక్రమ మైనింగ్, అనుమతులు లేకుండా ఖనిజాలను తరలించే వ్యవహారాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.








