హైదరాబాద్ : ఫార్మాస్యూటికల్ రంగంలో అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ప్రయోగశాల పరికరాలను అనలిటికా ల్యాబ్ ఇండియా ఎక్స్పో స్పష్టంగా ప్రతిబింబిస్తోందని పల్నాడు జిల్లా మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యాగంటి మల్లికార్జునరావు అన్నారు.
హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనలిటికా ల్యాబ్ ఇండియా ఎక్స్పోను యాగంటి మల్లికార్జునరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఫార్మాస్యూటికల్ రంగంలో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రయోగశాల పరికరాలు, వాటి పనితీరును ఆయన ఆసక్తిగా పరిశీలించారు. వివిధ ఫార్మా సంస్థల ప్రతినిధులతో సమావేశమై నూతన పరికరాల వినియోగం, పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, ల్యాబొరేటరీల్లో సాంకేతికత వినియోగంపై వివరంగా చర్చించారు.
ఎక్స్పోలో యూఎస్ఎస్ ఫార్మా అనలిటిక్స్ ప్రతినిధి వంగేపరపు క్రాంతికుమార్, భాగ్యలక్ష్మి ఎలక్ట్రోలాబ్ ప్రతినిధి మధు, ల్యాబ్ ఇండియా ప్రతినిధి కిషోర్, గ్లాస్కో ప్రతినిధి రామ్ నరేష్ తదితరుల స్టాళ్లను యాగంటి ప్రత్యేకంగా సందర్శించారు. ఆయా సంస్థలు ప్రదర్శించిన ఆధునిక పరికరాల పనితీరు, సాంకేతికత, వాటి వినియోగంపై వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గానికి పరిశ్రమలను తీసుకురావడానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా స్థానిక యువతకు మెరుగైన భవిష్యత్తు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఫార్మాస్యూటికల్ పరిశ్రమల అభివృద్ధికి, పరిశోధనల్లో కచ్చితత్వానికి, నాణ్యమైన ఫలితాల సాధనకు అత్యాధునిక ల్యాబొరేటరీ పరికరాలు ఎంతో కీలకమని యాగంటి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఫార్మా రంగంలో వస్తున్న మార్పులను అనలిటికా ల్యాబ్ ఇండియా ఎక్స్పో ప్రతిబింబిస్తోందని తెలిపారు.
మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగాలంటే పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని యాగంటి పేర్కొన్నారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చొరవతో టెక్స్టైల్ పరిశ్రమ కోసం ఇప్పటికే దాదాపు 500 ఎకరాల భూమిని కేటాయించే దిశగా చర్యలు చేపట్టడం నియోజకవర్గ పారిశ్రామిక అభివృద్ధికి కీలక ముందడుగని అన్నారు.
టెక్స్టైల్ పరిశ్రమతో పాటు ఫార్మా, అనుబంధ పరిశ్రమలు, ల్యాబొరేటరీలు, ఇతర పారిశ్రామిక సంస్థలను మాచర్ల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని యాగంటి మల్లికార్జునరావు కోరారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు.
“మాచర్ల అభివృద్ధికి ఇప్పుడు సరైన సమయం వచ్చింది. పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తాయి.. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి.. ఉద్యోగాలు వస్తే మాచర్ల యువత భవిష్యత్తు మారుతుంది. మాచర్లను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించడమే మా లక్ష్యం” అని యాగంటి తెలిపారు.
పరిశ్రమల అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, యువతకు ఉద్యోగ అవకాశాలు అనే మూడు అంశాలను సమన్వయం చేసుకుంటే మాచర్లను రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాచర్ల ప్రాంతంలో త్వరలోనే పరిశ్రమలు ఏర్పడి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెటిరో జీఎం కెమికల్ హరినాథరెడ్డి, వంగేపరపు కోటేశ్వరరావు, మస్తాన్, శివ, చేకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.








