జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశంతో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మొత్తం 500 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందజేశారు.
గత ఆరు సంవత్సరాలుగా అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులతో పాటు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ పాల్గొని ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై నవీన్, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు, నేల కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల జలచరాలతో పాటు మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.
పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని వారు సూచించారు. నీటి వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని సంస్థ సభ్యులు తెలిపారు.
అదేవిధంగా గణపతి మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్సై నవీన్ సూచించారు. మండపాల వివరాలు, ప్రతిష్టించే గణపతి విగ్రహాల సంఖ్య ముందుగానే పోలీసులకు తెలియడం వల్ల అవసరమైన మేరకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజలందరూ పర్యావరణహితంగా, ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని ఎస్సై నవీన్,
ప్రవీణ్ కోరారు.








