contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఐపీఎల్‌ను తలపించిన ఏపీఎల్ ఫైనల్ వేడుకలు.. భీమవరం బుల్స్ ఘన విజేత

మంగళగిరి : మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఫైనల్ సందర్భంగా ఐపీఎల్‌ను తలపించేలా సందడిగా మారింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), జీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఫైనల్‌కు వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. ప్రేక్షకుల కేరింతలు, యువత ఉత్సాహం, అద్భుతమైన డ్రోన్ షో, విద్యుద్దీపాల అలంకరణలతో స్టేడియం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన స్టేడియానికి చేరుకోగానే అభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

లోకేష్ చేతుల మీదుగా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం

మంత్రి నారా లోకేష్ టాస్ నిర్వహించి సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ జట్ల మధ్య తుది పోరుకు శ్రీకారం చుట్టారు. టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఇరు జట్ల ఆటగాళ్లను అభినందించిన మంత్రి క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు.

మ్యాచ్ చివరి వరకు అభిమానులను ఉత్కంఠకు గురిచేసినా, ప్రతి బౌండరీకి కేరింతలు, ప్రతి వికెట్‌కు హర్షధ్వానాలతో స్టేడియం మారుమోగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఫైనల్ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

భీమవరం బుల్స్ ఏకపక్ష విజయం

ఫైనల్‌లో భీమవరం బుల్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సింహాద్రి వైజాగ్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భీమవరం బుల్స్ బ్యాటర్లు విధ్వంసకర ఆటతీరుతో కేవలం 9 ఓవర్లలోనే విజయాన్ని అందుకున్నారు. రేవంత్ రెడ్డి, హేమంత్ రెడ్డి మెరుపు అర్ధశతకాలతో ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఈ విజయంతో భీమవరం బుల్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఛాంపియన్‌గా నిలిచింది.

విజేతలకు ట్రోఫీలు అందజేసిన మంత్రి

మ్యాచ్ అనంతరం మంత్రి నారా లోకేష్ విజేత భీమవరం బుల్స్‌కు ఛాంపియన్ ట్రోఫీ, రన్నరప్ సింహాద్రి వైజాగ్ లయన్స్‌కు రన్నరప్ ట్రోఫీని ప్రదానం చేశారు. టోర్నమెంట్‌లో ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు అవార్డులు, నగదు బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు, ఎంపీ మతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

ఆధునిక సౌకర్యాలతో ముస్తాబైన మంగళగిరి స్టేడియం

గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరిన మంగళగిరి ఏసీఏ స్టేడియం ప్రస్తుతం ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. కేవలం 60 రోజుల్లో డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులు, ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూములు, ప్రేక్షకుల సౌకర్యాలు తదితర మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆధునీకరించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్మారక ఫలకాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన ఈ స్టేడియం భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడంతో పాటు యువ క్రికెటర్ల శిక్షణకు ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమం ముగింపులో ఏపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, నిర్వాహకులు, అధికారులు, క్రీడాకారులు, సిబ్బందిని మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :