గోదావరిఖని : రామగుండం నగరపాలక సంస్థలో గత ఐదు నెలలుగా ఒక్క కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు, 12వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఐదు నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోతే నగరంలోని ప్రజా సమస్యలను ఎక్కడ చర్చించాలని ఆమె ప్రశ్నించారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదా? అని నిలదీశారు.
మున్సిపల్ నిబంధనలను పక్కనపెట్టి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రజిత రవీందర్ ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు తమ డివిజన్ల సమస్యలను కౌన్సిల్లో ప్రస్తావించే అవకాశం లేకుండా చేయడం ద్వారా ప్రజల గొంతును అణచివేస్తున్నారని విమర్శించారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం లేకనే కౌన్సిల్ సమావేశాలను వాయిదా వేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, నిబంధనల ప్రకారం కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశాల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినట్లయితే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
“కౌన్సిల్ పాలకుల జాగీరు కాదు.. ప్రజల సమస్యలను చర్చించే ప్రజాస్వామ్య వేదిక. ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం” అని బొడ్డు రజిత రవీందర్ స్పష్టం చేశారు.









