contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నేతాజీ అస్థికల తరలింపు.. కుమార్తె పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భౌతిక అవశేషాలను జపాన్ నుంచి భారత్‌కు తీసుకురావాలని కోరుతూ ఆయన కుమార్తె అనితా బోస్ పఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అనితా బోస్ పఫ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది.

రెంకోజీ ఆలయం నుంచి భారత్‌కు తీసుకురావాలని డిమాండ్

జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో దశాబ్దాలుగా భద్రపరిచిన నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని అనితా బోస్ తన పిటిషన్‌లో కోరారు. తన తండ్రికి భారత్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా భౌతిక అవశేషాలను దేశానికి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు.

నేతాజీ కుమార్తెగా, ఆయన చట్టబద్ధమైన వారసురాలిగా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చే హక్కు తనకు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

గతంలో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కుటుంబ సభ్యులు

నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని కోరుతూ గతంలో దాఖలైన మరో పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించడానికి నిరాకరించింది. ఈ ఏడాది మార్చిలో నేతాజీ సోదరుడి మనవడు ఆశిష్ రే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించలేదు.

ఆ సమయంలో పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరారు. నేతాజీ ఏకైక చట్టబద్ధ వారసురాలు అనితా బోస్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని ఆయన తెలిపారు.

ఆ విచారణ సందర్భంగా వారసురాలు స్వయంగా పిటిషనర్‌గా కోర్టు ముందుకు రావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుల భావోద్వేగాలను గౌరవిస్తామని, అయితే చట్టపరమైన ప్రక్రియను సంబంధిత వారసులే ప్రారంభించాల్సి ఉంటుందని సూచించింది.

కేంద్రం స్పందన కీలకం

సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో అనితా బోస్ తాజాగా స్వయంగా పిటిషన్ దాఖలు చేయడంతో ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వం, హోం, విదేశాంగ శాఖలకు నోటీసులు జారీ కావడంతో ఈ అంశంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

నేతాజీ భౌతిక అవశేషాలను భారత్‌కు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం కోర్టుకు ఎలాంటి వైఖరిని తెలియజేస్తుందన్నది సెప్టెంబర్ 28న జరిగే తదుపరి విచారణలో కీలకంగా మారనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :