మంగళగిరి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు జనసేన కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసైనికులు, పార్టీ శ్రేణులు, వీరమహిళలను సన్నద్ధం చేయడమే కమిటీల ప్రధాన ఉద్దేశమని పార్టీ పేర్కొంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్తో పాటు ముగ్గురు సమన్వయ కమిటీ సభ్యులను నియమించారు. అదేవిధంగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక సహాయకుడిని కూడా ఎంపిక చేశారు.
మిత్రపక్షాలతో సమన్వయం
నియమిత కమిటీలు తమ పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయనున్నాయి. పార్టీ విధానాలకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంతో పాటు, పొత్తులో ఉన్న మిత్రపక్షాలతో సమన్వయంతో పనిచేసేలా చూడటం కమిటీల ప్రధాన బాధ్యతగా పార్టీ నాయకత్వం నిర్దేశించింది.
స్థానిక స్థాయిలో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడం, ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయడం, పార్టీ నాయకత్వం నుంచి వచ్చే సూచనలను క్షేత్రస్థాయికి చేరవేయడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి.
9న మంగళగిరిలో అవగాహన కార్యక్రమం
సమన్వయ కమిటీల సభ్యుల కోసం ఈ నెల 9న మంగళగిరిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నాయకత్వం కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనుంది.
ఎన్నికల వ్యూహం, పార్టీ శ్రేణుల సమన్వయం, మిత్రపక్షాలతో కలిసి పనిచేయాల్సిన విధానం తదితర అంశాలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసిన జనసేన.. తాజా కమిటీల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.








