contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఐలాపూర్ తాండ బాధితులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే జిఎంఆర్

  • ఐలాపూర్, ఐలాపూర్ తాండ బాధితులకు న్యాయం చేస్తాం..
  • ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారంటూ 52 మంది ఫిర్యాదులు చేశారు..
  • తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది..
  • ప్రభుత్వంతో చర్చించి న్యాయం అందిస్తాం..
  • వివాదాస్పద భూములు కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం..
  • బాధితులతో సమావేశమైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా : అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామం, ఐలాపూర్ తండాల పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో దళారుల చేతిలో మోసపోయి ఇళ్ల నిర్మాణం చేసిన బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వంతో చర్చించి పూర్తి న్యాయం అందించేందుకు కృషి చేస్తానని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇటీవల రెండు గ్రామాల పరిధిలో మోసపోయిన బాధితులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబుల కాలంలో ఐలాపురం గ్రామ పరిధిలోని 1200 ఎకరాల భూమిని వ్యవసాయ క్షేత్రం గా వినియోగించే వారని తెలిపారు. స్వాతంత్రం సిద్ధించిన అనంతరం తామే భూమి యజమానులంటూ పలువురు కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు స్టేటస్కో విధించడం జరిగిందని తెలిపారు. తదనంతరం పలువురు విద్యుత్ ఉద్యోగులు సొసైటీగా ఏర్పడి రాజగోపాల్ నగర్ పేరుతో భూములు కొనుగోలు చేసిన సమయంలోను.. రైతులు కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలని.. ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని.. తుది తీర్పు వచ్చేవరకు కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. 2001లో తాను పటాన్చెరు ఎంపీపీ గా ఉన్నప్పుడు అప్పటి జాయింట్ కలెక్టర్ భీం నాయక్ సమక్షంలో గ్రామానికి చెందిన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందించడం జరిగిందని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందడంతో… కొందరు దళారులు స్థానిక పరిస్థితులపై అవగాహన లేని వారికి తక్కువ ధరకే ప్లాట్లు అమ్ముతున్నామంటూ నిరుపేదలను, దినసరి కార్మికులను, రోజు కూలినాలి చేసుకునే పేద ప్రజలను మోసగించి రెండు గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి నోటరీల పేరుతో విక్రయించడం జరిగిందని తెలిపారు.

ఐలాపూర్ ఐలాపూర్ తండా పరిధిలో ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఇల్లు నిర్మాణం చేస్తున్నారంటూ 52 మంది వ్యక్తులు ముఖ్యమంత్రి కార్యాలయం, భూ పరిపాలన విభాగం, రెవిన్యూ శాఖ, జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులకు, హైకోర్టుకు ఫిర్యాదులు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

వీరి ఫిర్యాదుల ఆధారంగా అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించాలని కోర్టు ఆదేశించడం జరిగిందని తెలిపారు.

తెలిసి తెలియక, కోర్టు ఉత్తర్వులపై అవగాహన లేక, రూపాయి రూపాయి దాచిపెట్టి స్థలాలను కొనుగోలు చేసి, ఇల్లు కట్టుకొని నష్టపోయిన నిరుపేద బాధితులందరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కోర్టు తుది తీర్పు రైతులకు అనుకూలంగా వస్తే.. నోటరీలపై కొనుగోలు చేసిన బాధితులందరికీ రిజిస్ట్రేషన్ చేయించడంతోపాటు, ప్రభుత్వం అందించే గృహలక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి అవకాశాన్ని రాజకీయం చేయాలనుకునే ప్రతిపక్ష పార్టీ నాయకులు రెచ్చగొట్టేందుకు వస్తారని, వారి మాయ మాటలను నమ్మకుండా ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

తాను నిరుపేద కుటుంబం నుండి వచ్చానని పేదల కష్టనష్టాలు తనకు తెలుసునని అన్నారు.

అతి త్వరలో బాధితులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, డీఎస్పీ భీమ్ రెడ్డి, ఐలాపూర్ సర్పంచ్ మల్లేష్, ఐలాపూర్ తాండ నాయకులు రవి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :