జగిత్యాల : ఇబ్రహీంపట్నం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యామాపూర్–ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగుపై రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ సంయుక్తంగా వాగును పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
వాగులోని నీటి ప్రవాహాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు.

లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చోట ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తారని, ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, నదులు, వాగుల ఉద్ధృత ప్రవాహాలను చూసేందుకు ఎవరూ వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని సూచించారు.
ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అవసరం లేని ప్రయాణాలను నివారిస్తూ, అధికార యంత్రాంగం జారీ చేస్తున్న హెచ్చరికలను పాటించాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు








