మెదక్ జిల్లా – చిన్నశంకరంపేట : తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శనివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రాదేశాం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. పదేళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లను మంజూరు చేసిందని, అనంతరం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గృహ నిర్మాణ రంగంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని భారీ అప్పుల పాలుచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి, మొదటి విడతతో పాటు రెండో విడతలో కూడా ఇల్లు లేని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేసినట్లు తెలిపారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
అనంతరం కొర్విపల్లి తండా, టీ మాందాపూర్ తండాలలో ఏర్పాటు చేసిన బోరు మోటార్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, హేమ భానుచందర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు హలావత్ మోహన్ నాయక్, ఉప సర్పంచ్ హేమ భానుచందర్, పోతరాజు రమణ, సాన సత్యనారాయణ, రాజిరెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు, పుల్లారావు, మూడవ అశోక్ నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








