చేగుంట (తూప్రాన్ డివిజన్) : చేగుంట మండలంలోని మాసాయిపేట గ్రామంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, మాసాయిపేట గ్రామానికి చెందిన గుడ్డి దశరథ్ (49), కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను గ్రామంలోని కల్లు దుకాణం వద్ద ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన వడ్డే నగేష్ మరియు అతని అనుచరులు వడ్డే శ్రీకాంత్, వడ్డే దుర్గ స్వామి, వడ్డే సందీప్లతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొడవ తీవ్రరూపం దాల్చగా, వడ్డే శ్రీకాంత్ అక్కడే ఉన్న రాడ్తో దశరథ్ తలపై దాడి చేసినట్లు సమాచారం.
దీంతో తీవ్రంగా గాయపడిన దశరథ్ స్పృహ తప్పిపోయాడు. విషయం తెలుసుకున్న అతని తమ్ముడు గుడ్డి సిద్ది రమేష్ స్థానికులతో కలిసి వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి డ్యూటీ డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామయంపేట సీఐ వెంకటేశం, చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తదితరులు పరిశీలించారు.
నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.








