- మతిస్థిమితం కోల్పోయిన కొడుకును కాపాడాలని తల్లి వినతి….
- వెంటనే స్పందించి వైద్యం చేయించిన పరకాల సిఐ కిషన్…..
- నెల రోజుల తర్వాత సాధారణ స్థితికి చేరుకున్న కొడుకు….
- స్టేషన్లో తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..
మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తికి పరకాల సిఐ కిషన్ ప్రత్యేక చొరవతో వైద్యం చేయించి సాధారణ స్థితికి తీసుకొచ్చారు.గురువారం తల్లిదండ్రులకు సదరు వ్యక్తిని అప్పగించారు. నడికూడ మండలం రాయపర్తి గ్రామానికి చెందిన కొడపాక నరేష్కు భార్య ఇద్దరు పిల్లలు.కొంతకాలంగా అతను మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు.కొడుకును చూసి తల్లిదండ్రులు,భార్యాపిల్లలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.స్థానిక ప్రజాప్రతినిధులు ఇచ్చిన సలహాతో నెల క్రితం నరేష్ తల్లి సమ్మక్క పరకాల పోలీస్స్టేషన్కు వచ్చి కొడుకు పరిస్థితిని చెబుతు కన్నీటిపర్యంతమైంది.తమ కుటుంబం ఆగమైపోతోందని,ఎలాగైనా తమ కొడుకును బాగుచేయాలని వేడుకుంది.ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన సిఐ కిషన్ గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రత్యేక చొరవ తీసుకున్నారు.మెంటల్ యాక్ట్ సెక్షన్ కింద అతనిపై కేసు నమోదు చేసి,స్థానికంగా వైద్యం చేయించారు.పరిస్థితి మెరుగుపడకపోవడంతో జడ్జి సమక్షంలో హైదరాబాద్లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించారు.ఓ వైపు తీవ్రమైన పనిఒత్తిడి ఉన్నా, నరేష్ ఆరోగ్య పరిస్థితిని సిఐ కిషన్ నిరంతరం పర్యవేక్షించారు.నెల రోజుల చికిత్స అనంతరం ఎట్టకేలకు నరేష్ సాధారణ స్థితికి రావడంతో వైద్యులు పరకాల పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు.వెంటనే సిబ్బందిని పంపించి నరేష్ను తీసుకొచ్చి గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు.సాధారణ స్థితికి చేరుకున్న కొడుకు చూసి తల్లిదండ్రులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పరకాల పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల వల్లే తమ కొడుకుదక్కాడని, తమ కుటుంబం నిలబడిందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎస్సైలు ప్రశాంత్ బాబు, శివకృష్ణ,హరికృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.