పల్నాడు జిల్లా: జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట సబ్డివిజన్ పరిధిలోని నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి యలమంద గ్రామంలో గురువారం ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు పోలీసులు గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 2 గొడ్డళ్లు, 2 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఫుట్ పేట్రోలింగ్ నిర్వహిస్తూ గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి కూడా వివరించారు.
రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ట్రైనీ డీఎస్పీ తెలిపారు. రౌడీషీటర్లు, అనుమానితులు, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పాత కేసుల నిందితులతో సమావేశమై సత్ప్రవర్తనతో మెలగాలని సూచించిన పోలీసులు, గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ జయకృష్ణతో పాటు నరసరావుపేట 1టౌన్ సీఐ ఎస్కే.టి. ఫిరోజ్, నరసరావుపేట రూరల్ సీఐ ఎం.వి. సుబ్బారావు, చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు, నరసరావుపేట రూరల్ ఎస్సై కిషోర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








