పాకాల – తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల సమరశంఖం పూరించేందుకు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రణరంగానికి సర్వసన్నద్ధమయ్యాయి. పాకాల గడ్డపై వైసిపి జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పార్టీ క్యాడర్ అగ్నిశిఖలా విరుచుకుపడేందుకు సింహగర్జన చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పదునైన దిశా నిర్దేశంతో, చంద్రగిరి వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సమున్నత నాయకత్వంలో మండల వైసిపి నాయకులు, కార్యకర్తలు ఉక్కుపిడికిలిలా ఏకమయ్యారు.
ఈ సందర్భంగా వైసిపి ముఖ్య నాయకులు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. ఏకగ్రీవాల పేరిట సాగించే అక్రమ అజెండాలను, అప్రజాస్వామిక చర్యలను ఏమాత్రం సహించేది లేదని, ప్రతి బూత్ స్థాయిలోనూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తమ సైన్యం ఉక్కు సంకల్పంతో సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల తిరుగుబాటు:
ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, విఫలమైన హామీలపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోందని స్థానిక నేతలు ధ్వజమెత్తారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు హక్కుతో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల్లో వైసిపికి ఉన్న ఆదరణను ఏ శక్తీ తగ్గించలేదని, రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి రికార్డు విజయం సాధిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
పాకాలలో ప్రత్యర్థుల పప్పులు ఉడకవు:
పాకాల మండలంలో వైసిపికి ప్రజా మద్దతు తుఫానులా ఉప్పొంగుతోందని, ఎన్నికలు రేపో మాపో ఎప్పుడు వచ్చినా విజయం తమదేనని స్పష్టం చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తోడ్పాటుతో మండలంలోని ప్రతి బూత్ స్థాయిలో క్యాడర్ బలమైన ఆయుధంలా సిద్ధంగా ఉందని, ప్రత్యర్థుల పప్పులు పాకాలలో ఉడకవని గట్టిగా హెచ్చరించారు. వైసిపి సత్తా ఏంటో ఈ స్థానిక పోరులో ప్రత్యర్థులకు తెలిసొచ్చేలా తీర్పు రాబోతోందని, అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని పార్టీ శ్రేణులు విస్పష్ట ప్రకటన చేశారు.








