పాకాల (తిరుపతి జిల్లా) : పాకాల మండలం దామలచెరువు పంచాయతీ కుక్కలపల్లి గ్రామంలో పేరుకాలా మునిలత (30) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదనపు వరకట్నం కోసం భర్త, అత్తగారి కుటుంబ సభ్యులు వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాకాల సీఐ టి. చిన్న గోవిందు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన మునిలతకు, కుక్కలపల్లికి చెందిన గొడుగుచింత ఉదయ్ కుమార్తో 2024 మార్చి 28న వివాహమైంది. పెళ్లి సమయంలో 10 సవర్ల బంగారం ఇచ్చారు. అయినప్పటికీ అదనపు కట్నం కోసం భర్త ఉదయ్ కుమార్, పినతల్లి బుజ్జమ్మ, అక్క ఉష, చిన్నాన్న చంద్రబాబులు మునిలతను శారీరకంగా, మానసికంగా వేధించేవారు. వీరికి 8 నెలల బాబు ఉన్నాడు.
వేధింపుల పర్వం: గతంలో వేధింపులు తట్టుకోలేక మునిలత ఆత్మహత్యాయత్నం చేయగా, గర్భస్రావమైన సమయంలోనూ వేధించారు. ఇటీవల మే 18న గంగమ్మ జాతర సందర్భంగా, అలాగే జూన్ 4న తిరుపతిలో మునిలతను భర్త, కుటుంబ సభ్యులు కొట్టి, చావాలంటూ వేధించినట్లు మృతురాలి తండ్రి శంకరయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఘటన: జూన్ 9వ తేదీ అర్ధరాత్రి మునిలత మరణించినట్లు సమాచారం అందడంతో పుట్టింటివారు వచ్చి పరిశీలించారు. ఆమె మెడపై ఉరి గుర్తులు, ఒంటిపై గాయాలు ఉన్నాయి. వరకట్నం విషయమై గొడవ జరగడంతోనే ఆమె ఉరివేసుకుందని భర్త తెలిపినట్లు ఫిర్యాదులో వివరించారు.
పోలీసుల చర్య: మృతురాలి తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఉదయ్ కుమార్ సహా నలుగురిపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద పాకాల పోలీసులు కేసు నమోదు చేశారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.








