కరీంనగర్ జిల్లా: దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం నేతాజీ జయంతి సందర్భంగా కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాలోని ఆ మహనీయుని విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జీ పురమల్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నేతాజీ జీవితం మనందరికి స్ఫూర్తిదాయకమన్నారు. స్వదేశం పట్ల నేతాజీకి ఉన్న దేశభక్తి అపారమైనదని ఆయన పేర్కొన్నారు. త్యాగానికి, క్రమశిక్షణకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మారుపేరని ఆయన కొనియాడారు. స్వాతంత్రోద్యమం లో నేతాజీ కీలక పాత్ర పోషించారని, అతనిలోని ప్రగతిశీల భావాలే నేతాజీకి ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకత్వం వహించేలా చేశాయన్నారు.
