పల్నాడు జిల్లా – మాచర్ల :మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నరసింహులు ను విఆర్ కు బదిలీ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా వివాదాస్పదంగా మారిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం.
ఎస్ఐ నరసింహులు ఇటీవల ఒక యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కోరిన వ్యక్తితో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. వెంటనే ఆయన జిల్లా ఎస్పీకి ఈ విషయంలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
అంతేకాకుండా, మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని ఎస్ఐ నరసింహులు కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే జమ్మలమడక గ్రామంలో ఓ చిన్న పంచాయతీ విషయంలో మరో వ్యక్తిపై శారీరక దాడికి దిగినట్టు సోమవారం రోజు జిల్లా ఎస్పీకి వచ్చిన గ్రీవెన్స్ ఫిర్యాదులో పేర్కొనబడింది.
ఈ నేపథ్యంలో ఎస్పీ నిర్దాక్షిణ్యంగా స్పందించి, ఎస్సై నరసింహులను వీఆర్ కు బదిలీ చేశారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కాపాడేందుకు బాధ్యులపై తక్షణ చర్య తీసుకుంటామని జిల్లా ఎస్పీ పేర్కొన్నట్టు సమాచారం.