యెమెన్లో వ్యాపార భాగస్వామి హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గరపడుతున్న వేళ, ఈ కేసును విచారించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం ముందుకొచ్చింది. నిమిష ప్రియను కాపాడేందుకు దౌత్యపరమైన చర్యలు చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
ఈ పిటిషన్పై ఈ నెల 14న విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం తెలిపింది. కాగా, ఈ నెల 16నే నిమిష ప్రియకు ఉరిశిక్షను అమలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో విచారణను త్వరగా చేపట్టాలని సీనియర్ న్యాయవాది రాజేంత్ బసంత్ కోర్టును అభ్యర్థించారు. షరియా చట్టం ప్రకారం, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం (బ్లడ్ మనీ) చెల్లించడం ద్వారా క్షమాభిక్ష పొందే అవకాశం ఉందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
కేసు వివరాల్లోకి వెళితే… కేరళలోని పాలక్కాడ్కు చెందిన నిమిష ప్రియ, నర్సుగా ఉద్యోగం కోసం 2008లో యెమెన్కు వెళ్లారు. అక్కడ సొంతంగా క్లినిక్ ప్రారంభించేందుకు యెమెన్ పౌరుడైన తలాల్ అదిబ్ మెహదీని వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. అయితే, కొంతకాలానికే మెహదీ నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.
ఈ క్రమంలో 2017లో, అతని నుంచి తన పాస్పోర్ట్ను తిరిగి పొందేందుకు నిమిష ప్రియ ప్రయత్నించారు. అందులో భాగంగా అతనికి మత్తుమందు ఇచ్చారు. అయితే, ఆ మందు మోతాదు ఎక్కువ కావడంతో మెహదీ మరణించాడు. ఈ హత్య కేసులో విచారణ జరిపిన యెమెన్ న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది. తన కుమార్తెను కాపాడుకునేందుకు నిమిష తల్లి ప్రేమకుమారి గత ఏడాది యెమెన్కు వెళ్లి మృతుడి కుటుంబంతో చర్చలు జరిపినా అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.