తిరుపతి: తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉదయం సందర్శించారు. మొదటగా అకౌంట్స్, అన్నదానం, బోర్డు సెల్, ఐ.టి, సోషల్ మీడియా, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ కార్యాలయాలను సందర్శించి సదరు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా టిటిడి ఈవోకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉద్యోగులు నూతన సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకుని వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు.
అంతకుముందు ఈవో ఛాంబర్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీకోదండరామ స్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం నుండి వచ్చిన వేద పండితులు అనిల్ కుమార్ సింఘాల్ కు వేదాశీర్వచనం చేశారు. ముందుగా టిటిడి పరిపాలనా భవనానికి టిటిడి ఈవో చేరుకోగానే, పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికారు.
టిటిడి ఈవో వెంట ఎఫ్ఏ అండ్ సిఏవో ఓ. బాలాజీ, అదనపు ఎఫ్ఏసిఏవో రవిప్రసాద్, చీఫ్ ఇంజనీర్ టి.వి. సత్యనారాయణ తదితరులు ఉన్నారు.