హైదరాబాద్: మీడియా ముసుగులో చెలామణి అవుతున్న నకిలీ జర్నలిస్టులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక అక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్ను వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
క్షేత్రస్థాయిలో కొందరు కేవలం యూట్యూబ్ ఛానెళ్లు, ప్రైవేటు సంస్థల ఐడీ కార్డులను చూపిస్తూ వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, దీని వల్ల అసలైన జర్నలిస్టుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టం–1989 ప్రకారం వాహనాలపై లేదా నంబర్ ప్లేట్లపై అనధికారికంగా ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ వంటి పదాలను వినియోగించడం చట్టరీత్యా నేరమని అధికారులు గుర్తుచేశారు.
కొత్త నిబంధనలను అతిక్రమించి అక్రిడిటేషన్ లేకుండా ‘ప్రెస్’ స్టిక్కర్లు వాడితే, దానిని ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అటువంటి సందర్భాల్లో భారీ జరిమానాతో పాటు అవసరమైతే వాహనాన్ని సీజ్ చేసే అధికారం కూడా రవాణా శాఖకు ఉంటుందని హెచ్చరించారు. అక్రిడిటేషన్ లేని వారు తమ వాహనాలపై ఉన్న ‘ప్రెస్’ స్టిక్కర్లను తక్షణమే తొలగించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాలు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నకిలీ జర్నలిస్టుల కారణంగా ఏర్పడుతున్న గందరగోళానికి తెరపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, అక్రిడిటేషన్ లేని నిజమైన ఫీల్డ్ రిపోర్టర్లకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ, జర్నలిజం వృత్తి గౌరవాన్ని కాపాడేందుకు ఈ చర్య తప్పనిసరిగా అవసరమని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.









