జియ్యమ్మ వలస మండలం : పరిసరాల పరిశుభ్రత అనేది కేవలం నినాదం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని జియ్యమ్మ వలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిరూపించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆసుపత్రి ప్రాంగణంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాధారణంగా ఆసుపత్రులలో పారిశుద్ధ్య పనులు స్వీపర్లకే పరిమితం అన్న భావనకు భిన్నంగా, ఇక్కడ వైద్య సిబ్బంది అంతా స్వయంగా శ్రమదానంలో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగులకు సగం నయం అయినట్లేనని భావించిన డాక్టర్లు, నర్సులు, ఆశా కార్యకర్తలు ఐక్యంగా ముందుకు వచ్చారు.
వైద్య సిబ్బంది అందరూ కలిసి ఆసుపత్రి ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను శుభ్రం చేసి, ఆసుపత్రి పరిసరాలను అద్దంలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ప్రవేశపెట్టిన ముస్తాబ్ కార్యక్రమం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. నెలలో ఒకటి లేదా రెండు రోజులు తమ వృత్తిలో భాగంగా భావించి ఆసుపత్రిని తామే శుభ్రం చేసుకుంటున్నామని చెప్పారు.
కలెక్టర్ ప్రారంభించిన ఈ అద్భుతమైన కార్యక్రమం వల్ల గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడుతున్నాయని వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ జగదీశ్వరరావు, డాక్టర్ సాయి ప్రసన్న, హెచ్వి, స్టాఫ్ నర్సులు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఒక టీంలా అందరూ కలిసి పనిచేయడంతో ఆసుపత్రి ఆవరణ అతి తక్కువ సమయంలోనే కొత్త రూపును సంతరించుకుని పరిశుభ్రతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.








