కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్: పట్టణంలోని మీనాక్షి వైన్ షాప్ అక్రమాలకు, అపరిశుభ్రతకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం విక్రయాల్లో ఎక్సైజ్ నిబంధనలను పట్టించుకోకపోవడమే కాకుండా, వినియోగదారుల ఆరోగ్యంతో నిర్వాహకులు చెలగాటమాడుతున్నారనే విమర్శలు స్థానికంగా గట్టిగా వినిపిస్తున్నాయి.
నాణ్యత లేని వాటర్ ప్యాకెట్లు:
కాగజ్నగర్ పట్టణంలో ఈ వైన్ షాప్కు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్ (సిట్టింగ్)లో ఎటువంటి అనుమతులు లేని నాసిరకం వాటర్ ప్యాకెట్లను విక్రయిస్తున్నారని సమాచారం. ఐఎస్ఐ గుర్తు లేని ఈ నీటిని వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకరంగా డస్ట్ బిన్లు:
తిరందాస్ బస్తి ప్రాంతంలో ఈ షాప్ ముందు ప్రధాన రహదారికి ఆనుకుని డస్ట్ బిన్లు ఏర్పాటు చేయడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇవి స్పష్టంగా కనిపించక వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
పట్టపగలే అక్రమ రవాణా:
మీనాక్షి వైన్ షాప్ నుంచి అనుమతి లేని బెల్ట్ షాపులకు, ఇతర ప్రాంతాలకు పట్టపగలే మద్యం బాక్సులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ అక్రమ రవాణా జరుగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డిస్కో గ్లాసుల వినియోగం:
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్/డిస్కో గ్లాసులను విస్తృతంగా వినియోగించడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. వాడి పారేసిన గ్లాసులు చెత్తగా పేరుకుపోయి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి.

అధికారులు స్పందించాలి:
మున్సిపల్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మీనాక్షి వైన్ షాప్ వద్ద జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.







