contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుత్తి కోట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్న చారిత్రాత్మక గుత్తి కోటలో వెలసిన అతి పురాతన శ్రీ కోటా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అపూర్వ ఆధ్యాత్మిక దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. చైత్ర మాసం శుద్ధ చవితి సందర్భంగా ఉదయం కచ్చితంగా 6 గంటల 43 నిమిషాలకు భానుడి కిరణాలు స్వామివారి పాదాలను తాకడం విశేషంగా నిలిచింది.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అరుదైన ప్రకృతి-ఆధ్యాత్మిక ఘట్టం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఒక్కరోజే దర్శనమివ్వడం ప్రత్యేకత. ఈ అద్భుతాన్ని తిలకించేందుకు వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు.

ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పమాలలు, తోరణాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి మూల విగ్రహం చుట్టూ సాంప్రదాయ శైలిలో అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి.

పురాణ గాథల ప్రకారం ఈ ఆలయాన్ని కురు, పాండు వంశాలకు చెందిన రాజులు నిర్మించినట్లు చెబుతారు. శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన ఈ ఆలయం సూర్యకిరణాల ప్రవేశానికి అనుకూలంగా రూపకల్పన చేయబడినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల మార్చి 14, 15 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 50 లక్షల నిధులతో నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు విజయవంతం కావడంతో ఈ ఆలయానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జరిగిన సూర్యకిరణాల తంతు మరింత విశిష్టతను సంతరించుకుంది.

కర్ణాటక రాష్ట్రంలోని హంపి వీరపాక్ష దేవాలయంలో గాలిగోపురం ప్రతిబింబం తలకిందులుగా కనిపించే అద్భుత సాంకేతికతను పోలి, గుత్తి కోటలోని ఈ ఆలయంలో కూడా సూర్యకిరణాల సూటి ప్రవేశం శిల్పకళా ప్రతిభకు నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు.

శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ పురోహితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ అరుదైన దృశ్యం చూసిన భక్తులు తమను తాము అదృష్టవంతులుగా భావించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :