కుమురం భీం ఆసిఫాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో జవహర్ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా విశిష్ట సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పేర్కొన్నారు.
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్లో దేశ అభివృద్ధికి తోడ్పడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్సీ దండే విఠల్ను శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.








