అనంతపురం జిల్లా, గుత్తి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని గుత్తి పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.
గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి పట్టణంలో ఆయన కార్యాలయం వద్దతో పాటు పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచిత భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. గుత్తిలో కూడా పేదలకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేయడం విశేషంగా నిలిచింది.
ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత తక్కువ కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల హామీల మేరకు పెన్షన్ను రూ.3000 నుండి రూ.4000కి పెంచి, ప్రతి నెల వృద్ధులకు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టడమే కాకుండా, నీటి వనరుల వినియోగంలో ముందడుగు వేసిన నాయకుడిగా చంద్రబాబు నాయుడిని కొనియాడారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలనే దూరదృష్టి ఆయనదని తెలిపారు.
విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, పరిశ్రమలు, మహిళా సాధికారత, స్వయం ఉపాధి రంగాల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన పరిపాలకుడిగా ఆయనను అభివర్ణించారు. ఆధునిక పరిపాలన విధానాలు, పారదర్శకత, బాధ్యతతో ప్రజలకు చేరువైన నాయకుడిగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్, మండల ప్రధాన కార్యదర్శి పల్లా సాంబయ్య, చికెన్ శ్రీనివాసులు, సుంకన్న, తెలుగు యువత మండల అధ్యక్షుడు కిట్ట యాదవ్, మాజీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి, పత్రాలు రామకృష్ణ, పవన్ యాదవ్, క్రిష్ణ గోపాల్, సుధాకర్ నాయుడు, డాక్టర్ నాగేంద్ర, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.








