అనంతపురం జిల్లా గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రభుత్వ అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) రిలీఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు పెద్ద కొడుకుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఈ విడతలో దాదాపు 20 మంది లబ్ధిదారులకు రూ.5,72,849 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గుంతకల్లు నియోజకవర్గంలో మొత్తం 848 మంది లబ్ధిదారులకు రూ.5.73 కోట్ల ఆర్థిక సహాయం అందిందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన సమయంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ, తమకు ఆర్థికంగా అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు టీడీపీ బాధ్యుడు గుమ్మనూరు నారాయణస్వామి, టీడీపీ మహిళా నాయకురాలు పత్తి హిమబిందు, గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ లెక్కలచెరువు ప్రతాప్, గుత్తి టీడీపీ కన్వీనర్ ఎంకే చౌదరి, గుత్తి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు చికెన్ శ్రీనివాసులు, పత్రాల రామకృష్ణతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









