పాకాల, (తిరుపతి జిల్లా) : పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కమకలపాటి వినోద్ కుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందారు. పాకాల మండలం గుంతగాదంకి గ్రామ సమీపంలో రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్న ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిందిలా..
పాకాల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. చిన్న గోవిందు తెలిపిన వివరాల ప్రకారం… చంద్రగిరి మండలం ఇతేపల్లి పోస్టు, గుర్రప్పగారిపల్లి గ్రామానికి చెందిన కె. నాగరాజ నాయుడు కుమారుడైన వినోద్ కుమార్ రియల్ ఎస్టేట్, పైపుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. బెంగళూరులో తన వ్యాపార పనులను ముగించుకుని ఆయన తన హ్యుందాయ్ ఐ-10 కారులో ఒంటరిగా స్వగ్రామానికి బయలుదేరారు.
మధ్యాహ్నం సుమారు 3:10 గంటల సమయంలో కారు గుంతగాదంకి సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో వాహనం అధిక వేగంతో ఉండటం, అక్కడ రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండటంతో ఒక్కసారిగా కారుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో కారు దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు బ్రిడ్జిని బలంగా ఢీకొట్టింది.
సంఘటనా స్థలంలోనే మృతి:
ఈ భీకర ప్రమాదంలో వినోద్ కుమార్కు తీవ్ర రక్తస్రావ గాయాలు కావడంతో ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే పాకాల పోలీసులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విషాదంలో కుటుంబం:
మృతుడు వినోద్ కుమార్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మరణవార్త తెలియడంతో గుర్రప్పగారిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మానవ హక్కుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా యాక్టివ్గా ఉండే వినోద్ కుమార్ హఠాన్మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేసు నమోదు – దర్యాప్తు:
మృతుని బంధువు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాకాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పాకాల మహిళా ఎస్సై నాగ మంజుల ఈ కేసును లీడ్ చేస్తూ ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.








