గుత్తి : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్–జీ రామ్ జీ (VB-G RAM-G) కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించి పేద కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన VB-G RAM-G (Viksit Bharat Rozgar and Aajeevika Mission Grameen) కార్యక్రమం దేశ గ్రామీణాభివృద్ధి చరిత్రలో కీలక మైలురాయిగా నిలవనుందని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం కావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వారి కృషి వల్లే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా మారుతోందని అన్నారు.
VB-G RAM-G ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ రహదారుల నిర్మాణం, వ్యవసాయ అనుబంధ పనులు, పర్యావరణ పరిరక్షణ, శాశ్వత ఆస్తుల సృష్టి వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. దీంతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.
గ్రామీణ యువత, మహిళలు, రైతులు, వ్యవసాయ కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు. “వికసిత్ భారత్–2047” లక్ష్య సాధనలో భాగంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తుందని, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, సంక్షేమ రంగాల్లో కూటమి ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
“చంద్రబాబు నాయుడు విజన్ – నారా లోకేష్ కార్యదీక్ష, గ్రామీణాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, టీడీపీ సీనియర్ నాయకులు బాలనాగిరెడ్డి, ఆదినారాయణ, లాలుస్వామి, మాజీ టౌన్ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి, సుధాకర్ నాయుడు, సుంకన్న, అబ్బేదొడ్డి ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.








