న్యూఢిల్లీ : కోర్టు విచారణలకు సంబంధించిన అనధికారిక వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ కాకుండా ముందస్తుగా పర్యవేక్షించడం లేదా వాటిని స్వయంగా తొలగించడం చట్టపరంగానూ, సాంకేతికంగానూ సాధ్యం కాదని టెక్ దిగ్గజం గూగుల్ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు తన వాదనలను వివరిస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు హాజరైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. కోర్టు విచారణలకు సంబంధించిన అనధికారిక రికార్డింగ్లను అరికట్టేందుకు సోషల్ మీడియా వేదికలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది వైభవ్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై స్పందించిన గూగుల్, పిటిషనర్ సూచించిన నిర్దిష్ట వీడియోలను ఇప్పటికే తొలగించినట్లు, భారత్లో వాటిని బ్లాక్ చేసినట్లు కోర్టుకు తెలిపింది. అయితే ప్రతిరోజూ తమ వేదికపై లక్షలాది వీడియోలు అప్లోడ్ అవుతున్నందున వాటిలో ఏవి కోర్టు విచారణలకు సంబంధించినవో ముందుగానే గుర్తించి తొలగించడం సాంకేతికంగా సాధ్యం కాదని వివరించింది.
కంటెంట్ చట్టబద్ధతను నిర్ణయించే అధికారం న్యాయస్థానాలకే ఉంటుందని, తాము కేవలం డిజిటల్ వేదికను అందించే మధ్యవర్తి మాత్రమేనని గూగుల్ పేర్కొంది. నిర్దిష్ట యూఆర్ఎల్లు లేదా వీడియోలకు సంబంధించి కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాతే చట్టప్రకారం వాటిని తొలగించే చర్యలు తీసుకోవచ్చని అఫిడవిట్లో వెల్లడించింది.
కోర్టు విచారణల అనధికారిక రికార్డింగ్లు న్యాయవ్యవస్థ గౌరవం, విచారణల పారదర్శకతపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఈ అంశంపై సమర్థవంతమైన నియంత్రణ అవసరమని ఢిల్లీ హైకోర్టు గతంలో అభిప్రాయపడింది. తాజా విచారణలో గూగుల్ సమర్పించిన అఫిడవిట్ న్యాయవ్యవస్థ పవిత్రతను పరిరక్షించాల్సిన అవసరంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న డిజిటల్ వేదికలు ఎదుర్కొంటున్న సాంకేతిక, చట్టపరమైన సవాళ్లను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.








