కొమురం భీం ఆసిఫాబాద్, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని ఊట్సా రంగపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గోలేటి ధర్మయ్యపై వచ్చిన గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై జిల్లా పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) హరిప్రసాద్ బుధవారం విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన డీఎల్పీఓ, సంబంధిత రికార్డులు, ఖాతా పుస్తకాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఆరోపణలకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాస్తవాలను సేకరించారు.
ఈ సందర్భంగా డీఎల్పీఓ హరిప్రసాద్ మాట్లాడుతూ, విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను సిద్ధం చేసి త్వరలోనే జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ విచారణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని తమ అభిప్రాయాలు, వివరాలను అధికారులకు వెల్లడించారు. విచారణ ఫలితంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.








