కరీంనగర్ జిల్లా: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టిన మహాధర్న విజయవంతమైంది. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు కీలక పాత్ర పోషించారని ఉద్యోగ సంఘాల నాయకులు గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటం బాధాకరమని అన్నారు. ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసినా, చర్చలు జరిపినా అనేక న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధానంగా రెండో పీఆర్సీ అమలులో జాప్యం, ఆరు డీఏలు విడుదల కాకపోవడం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించడం, పెండింగ్ బిల్లులు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం, ఉద్యోగులు–పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందించే హెల్త్ కార్డుల పథకాన్ని సమర్థంగా అమలు చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
ధరల పెరుగుదల, జీవన వ్యయం కారణంగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆరు డీఏలు పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కుటుంబాలపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందకపోవడం ఆందోళనకరమన్నారు.
ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎస్ పరిధిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం నగదు రహిత వైద్య సేవలను అందించే హెల్త్ కార్డుల పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు ఐక్యంగా తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్కరి సమస్య కాదని, ఉద్యోగులందరి సమస్య అని పేర్కొంటూ హక్కుల సాధన కోసం సమష్టిగా పోరాడాలని అన్నారు.
మహాధర్నాను విజయవంతం చేయడంలో గన్నేరువరం మండల పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు గుడిపెల్లి వెంకట్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పిట్టల రాజేష్, మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం సభ్యులు కొరివి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. గన్నేరువరం మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.









