హైదరాబాద్ : మహిళల భద్రత, సాధికారతతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న ‘మీ సురక్ష – సహచరి’ కార్యక్రమంలో భాగంగా బేగంపేట పోలీస్ స్టేషన్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా మెప్మా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను ‘సహచరి’ కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతున్నారు. మహిళల రక్షణ, సైబర్ భద్రత, చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు నేరాల నివారణలో పోలీసులతో కలిసి పనిచేసేలా వారికి శిక్షణ, అవగాహన కల్పిస్తున్నారు.

కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 3,000 మందికి పైగా మహిళలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలకు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
రక్షాబంధన్ సందర్భంగా సహచరి సభ్యులు పోలీసు అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బేగంపేట ఏసీపీ శ్రీ గోపాలకృష్ణ మూర్తి మాట్లాడుతూ.. మహిళల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖకు, ప్రజలకు మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సీపీ బి. సుమతి, డీసీపీ శ్రీధర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహచరి సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








