గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో ప్రధాన కాలువ సమస్యపై రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. కాలువలో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను శనివారం మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో తొలగించి శుభ్రం చేశారు.
11వ డివిజన్లోని రైల్వే ట్రాక్ పక్కన జ్యోతినగర్ నుంచి 5 ఇంక్లైన్ వరకు ఉన్న ప్రధాన కాలువలో కొంతకాలంగా చెత్త, గడ్డి, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటితో పాటు వర్షపు నీరు కూడా ఇదే కాలువ ద్వారా ప్రవహిస్తుంది.
కాలువలో నీరు సజావుగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దోమలు, ఈగలు పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వెదజల్లింది. వర్షాలు కురిసిన సమయంలో నీరు నిలిచిపోయి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై రిపోర్టర్ టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. 11వ డివిజన్ కార్పొరేటర్ సహకారంతో జేసీబీని ఏర్పాటు చేసి కాలువలో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించిన మున్సిపల్ అధికారులు, 11వ డివిజన్ కార్పొరేటర్కు బస్తీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రిపోర్టర్ టీవీకి స్థానికులు అభినందనలు తెలిపారు.








