contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విద్యార్థులపై ఆర్టీసీ కండక్టర్ దౌర్జన్యం: పాకాలవారిపల్లె వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా

తిరుపతి జిల్లా, చంద్రగిరి: విద్యార్థుల పట్ల ఆర్టీసీ కండక్టర్ దురుసుగా ప్రవర్తించడంతో పాటు, ఉదయం వేళల్లో బస్సుల కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. మంగళవారం ఉదయం చంద్రగిరి మండలం పాకాలవారిపల్లె వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యార్థుల కథనం ప్రకారం.. తిరుపతి నుంచి మంగళంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు వద్ద విద్యార్థులు ఎక్కేందుకు ప్రయత్నించగా, కండక్టర్ బస్సు నిలిపే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. విద్యార్థులతో అసభ్యకర పదజాలంతో మాట్లాడటమే కాకుండా, తమ సమస్యలను పట్టించుకోకుండా అహంకారంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పాకాలవారిపల్లె ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఆర్టీసీ సిబ్బంది వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో ఆందోళన జరగడంతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఉదయం వేళల్లో అదనపు బస్సులు నడపాలని డిమాండ్

పాకాలవారిపల్లె మీదుగా ప్రయాణించే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉదయం వేళల్లో బస్సులు అందుబాటులో లేవని విద్యార్థులు తెలిపారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, అందుబాటులో ఉన్న బస్సుల్లో తీవ్ర రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

విద్యార్థుల ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లో అదనపు ఆర్టీసీ బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కండక్టర్‌పై విచారణ జరిపి తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు.

సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :