తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల పక్షపాతి అని వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. ఓబుళ్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంలోని అక్షయ క్షేత్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
చెవిరెడ్డి కుటుంబం సామాజిక సేవా స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా అక్షయ క్షేత్రంలోని అనాథ పిల్లలు, వృద్ధులకు పండ్లు, బ్రెడ్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, యువజన నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
డాక్టర్ ఓబుళ్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారని గుర్తు చేశారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మార్గం ఏర్పడిందని తెలిపారు.
విద్యార్థులు, యువత సంక్షేమానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని, రాజకీయాల్లోనూ వివిధ ఉన్నత పదవుల్లోనూ యువతకు అవకాశాలు కల్పించారని ఓబుళ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అవసరమైన పునాదిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వేశారని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఓబుళ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సేందిల్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ప్రదీప్ కుమార్తో పాటు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వెంకటేష్, ప్రశాంత్, భార్గవ్, మహేంద్ర రెడ్డి, విజయ్ కుమార్, భరత్ కుమార్ రెడ్డి, గని, దిలీప్, సాయికుమార్, భూపాల్, మధు, ప్రతాప్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, నాయకులు హాజరయ్యారు.








