contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శ్రీ వేంకటేశ్వర వేద వర్సిటీలో .. పబ్లికేషన్స్ పేరిట నిధుల స్వాహా

తిరుపతి : శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పబ్లికేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో గత కొన్నేళ్లుగా అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయనే ఆరోపణలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జీతభత్యాలతో కలిపి సుమారు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ, అందుకు అనుగుణంగా ప్రచురణలు, పరిశోధనా ఫలితాలు కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో పనిచేసిన వీసీలు సుదర్శన శర్మ, దేవనాథన్‌ హయాంలో పబ్లికేషన్స్‌పై నెలవారీ, వారపు నివేదికలు తీసుకుంటూ నాలుగు విభాగాల ద్వారా పర్యవేక్షణ ఉండేదని, దీంతో పరిశోధనా ప్రచురణలకు కొంత ఊతం లభించిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయిలో మార్పులు వచ్చిన తర్వాత పరిస్థితి క్రమంగా దిగజారిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఒక్కో పుస్తక ప్రచురణకు భారీగా నిధులు ఖర్చవుతున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో అవుట్‌పుట్‌ రావడం లేదని విమర్శకులు అంటున్నారు. విశ్వవిద్యాలయం నుంచి వెలువడాల్సిన వార్షిక న్యూస్‌లెటర్లు, పరిశోధనా వ్యాసాలు సైతం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2026 వరకు రీసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్‌ విభాగంలో జరిగిన ఖర్చులపై ఆర్థిక, పనితీరు ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

అకడమిక్‌ డీన్‌ పోస్టుపై ప్రశ్నలు

అకడమిక్‌ డీన్‌, రీసెర్చ్‌ హెడ్‌ వంటి కీలక బాధ్యతలు సాధారణంగా బోధనా అనుభవం కలిగిన ఫ్యాకల్టీ సభ్యులకు అప్పగించాల్సి ఉంటుందని, అయితే నాన్‌-టీచింగ్‌ కేడర్‌కు చెందిన వ్యక్తికి ఇలాంటి బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఈ నియామకాలు జరిగాయా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

అనుమతులు లేని సబ్జెక్టులు, ఫ్యాకల్టీలను సృష్టించి బోధనా కేడర్‌లోకి రావడానికి ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై విశ్వవిద్యాలయ అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

BOS ఆమోదం లేకుండా తరగతుల నిర్వహణ?

బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (BOS) ఆమోదం, అధికారిక సిలబస్‌ అనుమతులు లేకుండానే కొన్ని పాఠ్యాంశాలపై తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అకడమిక్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి వ్యవహారాలు జరిగితే విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని విమర్శకులు పేర్కొంటున్నారు.

అదేవిధంగా డైరెక్టర్‌ పోస్టు కేటాయింపు విషయంలోనూ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అధికారిక నోటిఫికేషన్‌ లేకుండానే పదవి కేటాయించుకున్నారని, ప్రొఫెసర్‌ స్కేల్‌ ఆధారంగా తనను తాను ప్రొఫెసర్‌గా పేర్కొనడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు.

పీహెచ్‌డీ అడ్మిషన్లలో తీవ్ర జాప్యం

రీసెర్చ్‌ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2016 నాటి నిబంధనలనే కొనసాగిస్తూ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం వల్ల పరిశోధక విద్యార్థులు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు.

2025లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 2026లో ప్రవేశ పరీక్ష నిర్వహించి, 2027లో గైడ్‌లను కేటాయించే పరిస్థితి ఉంటే పరిశోధకుల విలువైన సమయం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వృథా అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశోధనా ఫైళ్లు కూడా ముందుకు కదలడానికి ఎక్కువ సమయం పడుతోందని, దీనిపై ప్రత్యేక అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు.

పాత పనికి కొత్త ప్రాజెక్టు?

మ్యాన్యుస్క్రిప్ట్‌ కేటలాగ్‌ విషయంలోనూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వవిద్యాలయ సిబ్బంది గతంలోనే పూర్తి చేసిన తాళపత్ర గ్రంథాల కేటలాగ్‌ పనిని కొత్త ప్రాజెక్టుగా చూపించి సుమారు రూ.45 లక్షల నిధులు పొందేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సంబంధిత ప్రాజెక్టు పత్రాలు, నిధుల మంజూరు వివరాలు, పనుల పూర్తిస్థితిని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.

అదేవిధంగా విశ్వవిద్యాలయంలోనే ఖరీదైన జిరాక్స్‌ మిషన్లు, స్కానర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, బయట వ్యక్తులకు చెల్లింపులు చేసి జిరాక్స్‌, ఇతర పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అధికారులు వివరించాలని ప్రశ్నిస్తున్నారు.

సమగ్ర విచారణకు డిమాండ్

విశ్వవిద్యాలయ ప్రతిష్టను కాపాడటంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరాల్లో జరిగిన నియామకాలు, పబ్లికేషన్స్‌, పరిశోధనా ప్రాజెక్టులు, నిధుల వ్యయం, పీహెచ్‌డీ అడ్మిషన్లు తదితర అంశాలపై స్వతంత్ర ఉన్నతస్థాయి ఆడిట్‌, పనితీరు పరిశీలన, సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థులు, మేధావులు, వేద పండితులు కోరుతున్నారు.

అవకతవకలు నిజమని విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో నిరాధార ఆరోపణలు ఉంటే వాటిపైనా స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఈ ఆరోపణలపై సమగ్ర వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :