ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు లేని వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి (మే 7) నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో పాటు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునేందుకు కూడా వీలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డులలో సభ్యుల చేరిక, తొలగింపు, చిరునామా మార్పులు, కార్డుల విభజన వంటి సవరణలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులలో మార్పుల నిమిత్తం ఇప్పటికే 3.28 లక్షల దరఖాస్తులు అందాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, తగిన మార్పులు చేపట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా, ప్రభుత్వం జారీ చేయనున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల గురించి మంత్రి వివరిస్తూ, “ఈ కార్డులు క్యూఆర్ కోడ్ సెక్యూరిటీ ఫీచర్తో వస్తాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వాధినేతల ఫోటోలు లేకుండా, కేవలం ప్రభుత్వ అధికారిక చిహ్నంతోనే ఈ స్మార్ట్ కార్డులను జారీ చేస్తాం” అని తెలిపారు. కుటుంబ సభ్యుల పేర్లు స్పష్టంగా కనిపించేలా కార్డుల రూపకల్పన ఉంటుందని, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా గత ఆరు నెలల రేషన్ తీసుకున్న వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అర్హులైన పౌరులు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ నెల నుంచి కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 95 శాతం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారు కార్డుల్లో మార్పుల కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈ నెల 12వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందేందుకు వీలు కల్పించినట్లు ఆయన గుర్తుచేశారు.