ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు నెలవైన పుట్టపర్తి గడ్డపై దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దేశీయ సాంకేతికతతో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేసే ప్రతిష్ఠాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతో పుట్టపర్తి ఇకపై భక్తికి మాత్రమే కాకుండా దేశ భద్రతకు కూడా కీలక కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
పుట్టపర్తిలో నూతన అధ్యాయం
పుట్టపర్తి ఇకపై ఆధ్యాత్మిక కేంద్రం నుంచి వ్యూహాత్మక రక్షణ ఆవిష్కరణల కేంద్రంగా మారుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఆమ్కా’ ప్రాజెక్టు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా నిలుస్తుందని తెలిపారు. రూ.15,803 కోట్ల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తొలి దశలో 7,500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు.
భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశీయ సాంకేతికతతో అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని చెప్పారు.
వేగంగా అనుమతులు.. “జెట్ స్పీడ్ డెవలప్మెంట్”
ఈ ప్రాజెక్టుకు అనుమతులు లభించిన వేగాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇది నిదర్శనం” అని అన్నారు. చర్చల నుంచి శంకుస్థాపన వరకు జరిగిన వేగవంతమైన ప్రక్రియను వివరించి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో రక్షణ పరిశ్రమల విస్తరణ
మడకశిరలో భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్సీఎల్, దోనకొండలో బీడీఎల్ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం తెలిపారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా ఆధునిక డ్రోన్ ఎకోసిస్టమ్ ఏర్పడుతోందని పేర్కొన్నారు. శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయలంక నుంచి క్షిపణి శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, ఇప్పుడు పుట్టపర్తి నుంచి వైమానిక శక్తితో ఏపీ దేశానికి రక్షణ కవచంగా మారుతోందని అన్నారు.
రాయలసీమ అభివృద్ధిపై దృష్టి
రాయలసీమను “రాళ్ల సీమ” నుంచి “రత్నాల సీమ”గా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. పెనుకొండ కియా పరిశ్రమ విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ, కడప స్టీల్ ప్లాంట్ను 2028 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ ద్వారా బంగారం ఉత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
నీటిపారుదలతో అభివృద్ధి దిశగా
హంద్రీనీవా, తెలుగుగంగ వంటి ప్రాజెక్టుల పూర్తి ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. నీటి సమర్థ నిర్వహణతో పుట్టపర్తి చెరువు మే నెలలోనూ నిండుగా ఉండటం సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత పాలన వల్ల రాష్ట్రం వెనుకబడిందని విమర్శించిన సీఎం, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతోందని చెప్పారు. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, 24 లక్షల ఉద్యోగాల లక్ష్యం ఉందని వెల్లడించారు.
పొదుపు ఉద్యమానికి పిలుపు
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పొదుపు అవసరమని సీఎం పేర్కొన్నారు. ఇంధన వినియోగం తగ్గించడం, ప్రజా రవాణా వినియోగం పెంపు, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఈ పొదుపు ఉద్యమంలో దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.








