ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి డుమ్మా కొట్టారు. ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలంటూ విజయసాయికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. అయితే, 18వ తేదీన విచారణకు రాలేనని… ఆ రోజున తనకు ముందే నిర్ణయించుకున్న పనులు ఉన్నాయని… తాను ఒక రోజు ముందుగానే 17వ తేదీన విచారణకు వస్తానని సిట్ అధికారులకు విజయసాయి సమాచారం పంపారు. దీనికి సిట్ అధికారులు అంగీకరించారు.
విజయసాయి విచారణ కోసం విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లోని సిట్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సీపీ కార్యాలయం ఎదుట కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సిట్ విచారణ బృందం కూడా అక్కడకు చేరుకుంది. మధ్యాహ్నం అయినప్పటికీ విజయసాయి అక్కడకు చేరుకోలేదు. విచారణకు విజయసాయి డుమ్మా కొట్టారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈరోజు విచారణకు హాజరుకాలేక పోతున్నానని సమాచారం పంపారు. విచారణకు ఎప్పుడు వస్తాననేది తెలియజేస్తానని చెప్పారు.
మరోవైపు మద్యం కేసులో గతంలో సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా మీడియాతో విజయసాయి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం అంతా కసిరెడ్డి కనుసన్నల్లోనే నడిచిందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా అధికారులకు అందిస్తానని చెప్పారు.