అనంతపురం జిల్లా, గుత్తి: గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ గుంతకల్లు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఇన్చార్జ్ వై. వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రతి స్థానంలోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆయన తెలిపారు. ప్రజల ఆశీస్సులతో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేలా కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.
గుత్తి తాగునీటి సమస్యపై ఆవేదన
గుత్తి పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యపై మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గుత్తి ప్రజలకు నీటి సమస్య లేకుండా చేసేందుకు చేపట్టిన పనుల్లో దాదాపు 70 శాతం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
రైతులను ఆదుకోవాలని డిమాండ్
సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంకటరామిరెడ్డి అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారి సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.
ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుండి అండగా నిలవాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రజలే వెన్నుదన్నుగా నిలుస్తారని పేర్కొంటూ గుత్తిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పట్టణ కన్వీనర్ కప్పల బండ మధుసూదన్ రెడ్డి, మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చంద్రగిరి రాధమ్మ యాదవ్, కో-ఆప్షన్ సభ్యుడు మైనుద్దీన్, మల్లయ్య యాదవ్, గోవర్ధన్ రెడ్డి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.








