ఢిల్లీ : కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఇక, దేశంలో వివిధ సామాజిక వర్గాల, స్థితిగతులు, వారి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి కులగణన ఎంతో అవసరమనేది పలువురు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తల అభిప్రాయం.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో సహా అనేక విపక్ష రాజకీయ పార్టీలు కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, రాబోయే జనాభా లెక్కల ప్రక్రియలోనే కులగణనను కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ జనాభా లెక్కలు 2021లోనే చేపట్టాల్సి ఉండగా… మహమ్మారి కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది.
జన, కులగణనతో పాటు కేంద్రం చెరుకు రైతులకు తీపి కబురు చెప్పింది. క్వింటాల్ చెరుకుకు రూ. 355 అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే సిల్చార్-షిల్లాంగ్ కారిడార్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 22,864 కోట్ల వ్యయంతో 166.8 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. దీంతో పాటు అసోం-మేఘాలయ కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది.