జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొజన్ కొత్తూర్ గ్రామంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ అధికారులు నుండి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని రైతులకు న్యాయం చేసే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ వడగండ్ల వాన, ఈదురుగాలులతో ఇబ్రహీంపట్నం మండలంలో వరి, మామిడి, నువ్వు, సజ్జలు పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పసల్ బీమా పథకం అమలు చేసి ఉంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి నష్ట పరిహారం లభించేదని ఇప్పటికైనా రాష్ట్రంలో పసల్ భీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు, జిల్లా కలెక్టర్ కు లేఖ రాస్తానని చెప్పారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశానికి వెన్నుముఖ వ్యవసాయాన్ని ఆదుకునేందుకు, ప్రకృతి విపత్తులు వస్తాయనే ముందుచూపుతో కేంద్ర ప్రభుత్వం పసల్ భీమా పథకం ప్రవేశపెడితే గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదని అందువల్లే రైతులకు నష్టపరిహారం అందడం లేదని మండిపడ్డారు. గత బి.ఆర్.ఎస్ పాలన కంటే అద్వాన్నంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.