- ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మంది నేతలు
- 39 మందితో కొత్త కమిటీని నియమించిన ఖర్గే
- శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది నేతలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కొత్త వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ఏర్పాటు చేసింది. మొత్తం 39 మందితో కమిటీని నియమించింది. ఇందులో శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది నేతలు, ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మంది నేతలు ఉండనున్నారు. సీడబ్ల్యూసీ టీమ్లో ఏపీ నుంచి రఘువీరారెడ్డికి ప్రాతినిథ్యం దక్కింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు వర్కింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించారు.
ఖర్గేతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, జైరాం రమేశ్, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, శశిథరూర్, సచిన్ పైలట్, అధిర్ రంజన్ చౌదురి, ప్రియాంకా గాంధీ తదితరులు ఉన్నారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరారెడ్డి, రాజస్థాన్లో రెబల్గా మారిన సచిన్ పైలట్, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశిథరూర్ పేర్లు కూడా సీడబ్ల్యూసీలో ఉండటం గమనార్హం.
సీడబ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం రఘువీరారెడ్డికి మాత్రమే చోటుదక్కింది. తెలంగాణకు చెందిన నేతలకు స్థానం దక్కలేదు. శాశ్వత ఆహ్వానితులుగా సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనర్సింహా తదితరులు ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వంశీచంద్రెడ్డి, పల్లంరాజు తదితరులు ఉన్నారు.