పాకాల, తిరుపతి జిల్లా : ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా పాకాల మండలంలో గుర్తించిన ‘సంబంధం నిర్ధారణ కాని ఓటర్లు’ (నో మ్యాపింగ్), ‘వివరాల్లో అసమానతలు ఉన్న ఓటర్లు’ (అనామలీస్)పై అధికారిక విచారణ చేపట్టనున్నట్లు 166-చంద్రగిరి సహాయ ఎన్నికల నమోదు అధికారి, పాకాల తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు.
పాకాల మండల పరిధిలో 3,622 ఓట్లు నో మ్యాపింగ్ కేటగిరీలో, 7,457 ఓట్లు అనామలీస్ కేటగిరీలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 11,079 ఓట్లకు సంబంధించిన వివరాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు, వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టేందుకు ఈ విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత ఓటర్లకు ఇప్పటికే విచారణ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న కేంద్రం, తేదీ, సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు.
ఆధార పత్రాలతో హాజరు కావాలి
విచారణకు వచ్చే ఓటర్లు తమ వద్ద అందుబాటులో ఉన్న సంబంధిత ఆధార పత్రాలను అసలు పత్రాలతో పాటు స్వయంగా ధృవీకరించిన ప్రతులతో తీసుకురావాలని అధికారులు సూచించారు.
విచారణ సమయంలో అవసరాన్ని బట్టి కింది పత్రాలను సమర్పించవచ్చని తెలిపారు:
- విచారణ నోటీసు, ఓటరు గుర్తింపు కార్డు
- జనన ధృవీకరణ పత్రం లేదా పదో తరగతి/మెట్రిక్యులేషన్ ధృవీకరణ పత్రం
- పాస్పోర్టు లేదా శాశ్వత నివాస ధృవీకరణ పత్రం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు
- పింఛనుదారు గుర్తింపు కార్డు లేదా పింఛను చెల్లింపు ఉత్తర్వు
- 1987కి ముందు ప్రభుత్వం, తపాలా శాఖ, బ్యాంకులు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన పత్రాలు
- కుల ధృవీకరణ పత్రం, భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రాలు
- కుటుంబ రిజిస్టర్, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, వర్తించే సందర్భాల్లో జాతీయ పౌరుల నమోదు పత్రాలు
- ఆధార్ కార్డు లేదా ఎన్నికల సంఘం సూచించిన ఇతర గుర్తింపు పత్రాలు
తల్లిదండ్రుల వివరాల నిర్ధారణపై దృష్టి
అవసరమైన సందర్భాల్లో ఓటర్లు సమర్పించే పత్రాల్లో వారి వ్యక్తిగత వివరాలతో పాటు తండ్రి లేదా తల్లి పేర్లు, కుటుంబ సంబంధాలను నిర్ధారించే సమాచారం స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచించారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ వద్ద ఉన్న సరైన ఆధార పత్రాలతో విచారణకు హాజరై అధికారులకు సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితాలో అర్హులైన వారి వివరాలు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నమోదు చేయడం, తప్పులుంటే సరిచేయడం లక్ష్యంగా విచారణ నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు.








