హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో కర్ణాటకకు చెందిన బీదర్ దొంగల ముఠా కాల్పులు జరిపింది. ఈ దొంగల ముఠా బీదర్ పోలీసులపై కాల్పులు జరిపింది. ఈ ఘటన అఫ్జల్గంజ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. బీదర్ దొంగలు వచ్చారని తెలిసి బీదర్ నుంచి పోలీసులు కూడా హైదరాబాద్కు వచ్చారు. అఫ్జల్గంజ్లో పోలీసులను చూసిన దొంగల ముఠా పోలీసుల పైకి కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. పోలీసులను చూసిన దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. బీదర్లో గురువారం ఉదయం ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో బీదర్ నుంచి హైదరాబాద్ నగరానికి గురువారం సాయంత్రం వరకు చేరుకున్నారు. అఫ్జల్ గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు తారసపడ్డారు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అఫ్జల్ గంజ్లో ఉన్న ప్రయివేటు ట్రావెల్స్ కార్యాలయంలోకి దొంగలు ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్కు గాయాలయ్యాయి.