ఇద్దరు ఉన్నతాధికారిణుల మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. కర్ణాటకలో ని ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి సీనియర్ ఐఏఎస్ అధికారులకు తన వ్యక్తిగత ఫొటోలను (అవాంఛిత) పంపినట్టు ఐపీఎస్ అధికారి అయిన రూప మౌద్గిల్ ఆరోపించడం తెలిసిందే. దీంతో రూపపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని రోహిణి ఇప్పటికే కోరారు. తాజాగా తనపై చేసిన వ్యాఖ్యలకు గాను నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలని, క్షమాపణ చెప్పాలంటూ రూప మౌద్గిల్ కు రోహిణి సింధూరి లీగల్ నోటీసులు పంపించారు.
ప్రతిష్టకు జరిగిన నష్టం, మానసిక వేదనకు గాను ఈ మొత్తం చెల్లించాలని రోహిణి డిమాండ్ చేశారు. ఫేస్ బుక్ లో రోహిణికి వ్యతిరేకంగా రూప మౌద్గిల్ పోస్ట్ పెట్టడం, అవినీతి సహా 19 ఆరోపణలు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. తన షరతులను అమలు చేయకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని రోహిణి సింధూరి హెచ్చరించారు. తన ఫొటోలను సీనియర్ ఐఏఎస్ అధికారులకు పంపించడం ద్వారా సర్వీస్ నిబంధనలను రోహిణి ఉల్లంఘించారన్నది రూప మౌద్గిల్ ఆరోపణగా ఉంది.