కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ జిల్లా మ్యాటర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కరాటేలో మూడు సంవత్సరాలుగా శిక్షణ పొందిన విద్యార్థిని, విద్యార్థులకు కలర్ బెల్ట్ అప్గ్రేడింగ్ టెస్ట్లు మరియు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, టాస్క్ ఫోర్స్ ఎస్సై మామిడాల సురేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే అనేది అత్యంత ప్రాచీనమైన యుద్ధ విద్య అని, అన్ని యుద్ధ కళలకు కరాటే మాతృకలాంటిదని పేర్కొన్నారు. కరాటేలో సాధించే ట్యాగ్ట్ (TAGT) సర్టిఫికెట్ల ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్యతో పాటు స్పోర్ట్స్ రిజర్వేషన్ కోటా ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని వివరించారు.
అలాగే కరాటే శిక్షణ ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని, సమాజంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం కలుగుతుందని విద్యార్థులకు సూచించారు.
అనంతరం కరాటే శిక్షణ కోచ్ రాజేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించగా, కరాటే విద్యార్థులు మరియు నిర్వాహకులు కలిసి ఎస్సై మామిడాల సురేందర్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ రాజేందర్, సినీ నటుడు శ్రీ రామోజీ సుమన్, సీనియర్ జర్నలిస్ట్ బుర్ర రాజ్కోటి గౌడ్తో పాటు పలువురు క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.








